Feeds:
Posts
Comments

పుస్తకం లో నా వ్యాసం చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారందరికీ ధన్యవాదాలు. వీరందరూ నాకంటే సాహిత్య పఠనం లో కొన్ని వందల రెట్లు అనుభవం, పాండిత్యం ఉన్నవారని నా గట్టి నమ్మకం. ఇది వ్యంగ్యం ఎంతమాత్రం కాదు కానీ, పాఠకలోకం అంతా మీ అంత పరిణతి కలది కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. “మైదానం” చదివి, రంగనాయకమ్మ గరి వ్యాసం పైపైన చూసేసి, ఈ వ్యాసం రాయలేదు నేను.

“సింధు కి రంగనాయకమ్మగారి సాహిత్యం కూడా అర్ధమైనట్టు లేదు” అని పెద్దలెవరో వాత పెట్టారు. మీ అంత సాహిత్యం నేను చదివి, నాకు అర్ధమయిందండీ అని నేను ఆవిడ మాటలను వక్రీకరించి రాస్తే.. అప్పుడు మీరు ఈ మాట అనవచ్చునేమో. సరే మాట ఎలాగూ పడ్డాను కాబట్టి, రంగనాయకమ్మ గారి ఏ వాక్యలలో భావసారూప్యం కనపడి, బలం గా నా మాటలు మీ దాకా చేర్చానో, ఇక్కడ ఉటంకిస్తున్నాను. ఇవి “మైదానం” గురించి రంగనయకమ్మ గారి వ్యాసం లోనివి:

“ప్రేమరహితమైన సాంప్రదాయ సంబంధాలు, పరిమళ రహితమైన గడ్డిపూలవంటివే, కానీ, ప్రేమని తాత్కాలిక వాంచలతో సమానం చేసుకుంటే, వాంచల నీచత్వానికే ప్రేమ ముసుగు కప్పుకుంటే, దాని ఫలితం సాంప్రదాయంలో ఉండే కనీస రక్షణని కూడా సర్వనాశనం చేస్తుంది.”

” రచయిత కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిన ఈ కథలో, రెండు ప్రేమలతో పాటకులందరికీ ఏకీభావం కుదరడం అసాధ్యం. వైరుధ్యాలతో నిండి ఉన్న కథా వస్తువుని ఎన్ని ప్రకృతి వర్ణనలతో అలంకరించినా, ఆ అలంకారమే ఆ కథ స్వభావం మారుస్తుందా? “

“కథలో ఉన్న అసంబద్ధతలని ఏ ప్రకృతి వర్ణనలూ మరుగుపరచలేవు.”

నేను చెప్పిన ఇద్దరు అమ్మాయిల విషయాలూ, స్త్రీలందరూ ఇలానే చేస్తున్నారని నేను చెప్పటం ఎంతమాత్రం కాదు, అది నా వ్యాసం లోనే నిర్ద్వంద్వంగా రాశాను..”ఇప్పటిదాకా నేను చెప్పింది అసంభవం కాదు అని మాత్రమే, సమర్థనీయం అని కాదు. “

ఇంకా “పెళ్ళైన ఆడోళ్ళందరూ లేచిపోతున్నారయ్యా” అని నేను రాస్తే,.”మీ ఊరి అమ్మాయి పిల్లలని వదిలేసి ప్రియుడితో లేచిపోయిందని చెప్పి భర్త చనిపోయిన వాళ్ళందరూ అదే పని చేస్తారంటే మీకు చలం గారే కాదు, వీరేశలింగం గారు కూడా అర్థం కారు.” అని మీరు అంటే చాలా సబబుగా ఉండేది. కాని పక్షంలో అది అసందర్భ విమర్శే అవుతుంది.

మైదానం ఒక సర్రియల్ నవల అన్నారు మరెవరో. ఆమె అమీర్ తో మైదానానికి వచ్చి, సెలయేరులో, వెన్నెలలో, చిరుగలితో సయ్యాటలాడటం వరకూ అది సర్రియల్ నవలే.. అనంతరం పరిణామాలే వికటించాయి. మీరు ఏమి వ్యాసాలలో ఏమి రాసుకున్నా, నా విమర్శ పరిథి మాత్రం, “మైదానం” పాత్రలకే పరిమితం.

సరే.. “రాజేశ్వరి స్థానంలో, నేనో, నావాళ్ళో ఉండిఉంటే.. ఒక స్త్రీగా రాజేశ్వరి లోని శారీరక చైతన్యానికి సరిదూగే పురుషశక్తికి అమీర్ ప్రతీక ఐతే, అతను మరొక స్త్రీని కాంక్షించటం, దానికి ఆమె అంగీకరించి అతడిని స్వహస్తాలతో వేరే ఆమెకి అప్పగించటం”.. సాంప్రదాయమనే కట్ట తెంచుకుని ధైర్యంగా పొంగిన రాజేశ్వరిలాంటి ధీశాలి, ఇలా చేయటం ఊహించగలరా, అది త్యాగమా? దౌర్భల్యమా? ఆత్మవంచనా?

ప్రేయసి గర్భవతి అంటే, కోపంతో కాలితో డొక్కలో తన్నటం, ఎటువంటి విప్లవ చిహ్నమో మరి..
నేనేమీ హిందీ పండితురాలిని కాకపోయినా, “దీదీ” అంటే “సహోదరి” అని అర్ధం అని మాత్రం తెలుసు. సోదరిపై ప్రేమ ఉండటం ఎవరూ కాదు అనరు, కానీ, కామించటం, శారీరకంగా లొంగదీసుకోవటం కూడా విప్లవమే అంటే, “కాదు, అది వికృత ధోరణి” అనడానికి నాకు ఎవరి సాయమూ అవసరం లేదనుకుంటాను.

మరెవరో అంటున్నారు,..”ఇది నాకెప్పుడు అర్ధం కాదు చలాన్ని విమర్శిస్తున్నమనే వాళ్ళందరు ఆయన పలానా పరిస్తితులలలో అలా రాసి వుంటారు కాని ఆ కధ మాత్రం చెత్త… అంటారు? అంటే????? రాజేశ్వరి కి పిల్లలుంటే, మా ఇంటి వెనుకమ్మాయి లా చేసేదా కాదా అనే ఆలోచనతోనో … లేదా మా ఇంటి వెనుకమ్మాయి అలా చేయటం తప్పు కాబట్టి చలం మైదానం తప్పు అని రాసినట్లు వుంది మీ వ్యాసం…”

చలాన్ని విమర్శిస్తున్నాం అనేవాళ్ళతో ఈ మాట అంటే సరిపోతుంది. చలాన్ని విమర్శించటానికి కావలసినది ఏదీ, మైదానం లో పాత్రల జాఢ్యన్ని విమర్శించటానికి అవసరం లేదు. చలాన్ని విమర్శించే జీవితానుభవం కానీ, అవసరం కానీ నాకు లేదు. మా వెనకింటి అమ్మాయో. పక్కింటి అమ్మాయో అలా చేయటం వలన, “మైదానం” రాజేశ్వరిలాగా కుటుంబాన్నీ, సాంప్రదాయమనే మాయనీ దాటి వచ్చే స్త్రీ అనే అంశం సంభవం, అంటే సాధ్యం అని నేను నమ్మాను అని రాశానే తప్ప, ఇందులో comparision or generalisation ఎక్కడా చేయలేదు.

చలం రచనను విమర్శిస్తే, ఆయన్ని విమర్శించటం కాదా, అంటే, ఖచ్చితంగా “కాదు” అనే చెప్తాను. దానికి కారణం కూడా, నా వ్యాసం లోనే చెప్పాను. 1927 న చలం ఈ కథను రాసేనాటికి సమాజం, స్త్రీల జీవనం ఎలా ఉండెదో, దాదాపు అందరికీ తెలిసే ఉంతుంది. ఒకవేళ తెలియని వాళ్ళుంటే, మీ నానమ్మ, వీలైతే వాళ్ళ తల్లిదండ్రులనో అడిగి చూడండి, నాకు తెలిసినదీ పెద్దవాళ్ళు చెప్పబట్టే. రాజేశ్వరి లాంటి స్త్రీల జీవనం, పొద్దున్నే లేచి, మొగుడికాళ్ళు కళ్ళకద్దుకుని, శారీరకంగా, మానసికంగా ఎంత అసంతృప్తి ఉన్నా భరించటమే స్త్రీ ధర్మమనే భ్రమలో, దాన్ని దాటితే మహాపాపమనే ధోరణిలో గడిచింది. పుట్టి కళ్ళు తెరిచింది మొదలు స్త్రీ ఎలా ఉండాలి అని తల్లి మొదలు చుట్టూ తన పరిధిలోని ప్రపంచమంతా ఇలాంటి నీతులనే మెదడుకెక్కించే పరిస్తితులవి. చలంగారిలాగా, మీలాగా నూత్నధోరణి ఏదైనా చెప్తే వాళ్ళని వెలివేసిన కాలం కాదా అది..

అటువంటి సమాజానికీ, అందులో మగ్గుతున్న ఆడవాళ్ళకీ కూడా “HIGH VOLTAGE ELECTRIC SHOCK” లాంటిది “మైదానం”.

స్త్రీ బానిసత్వానికి కారణమని భావించేవారందరినీ నడివీధిలో చెంపలు వాయగొట్టాలన్నంత కోపం చలం నరనరాల్లో ఉందండానికి “అమీర్” పాత్రే నిదర్శనం. రాజేశ్వరి భర్తనీ, మేనమామనీ, బావనీ, ముత్తైదువుల్నీ అతడు దూషించటమె అందుకు తార్కాణం.

“అతను వాళ్ళని తిట్టినా నాకేమీ అనిపించట్లేదు, అదేదో గతజన్మలా ఉంది” అని రాజేశ్వరి అనటం నా అంచనాకు ఊతం.

*** *** *** *** *** ***

ఎన్నికల మునుపు, 2004 లో..

” బంధుప్రీతి, అవినీతి, అరాచకాలకి దూరంగా, పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు విధులు నిర్వహిస్తే, మన వనరులు మనకు సరిపోతాయి, అలా కాని పక్షంలోనే పేదరికం పెల్లుబికేది.. “

… ఆవేశాన్నణుచుకుని ఎకనామిక్స్ లెక్చరర్ ఇంగ్లిష్ మీడియం కాలేజ్‌లో అచ్చమైన తెలుగులో, చెప్పిన మాటలు కొందరికి అర్థం కాలేదు కూడా.

ఆ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అయితే, తప్పంతా శాసనసభ్యులదేనా? ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా వారిని ఎంపిక చేసిన ప్రజలది తప్పు కాదా? అంటే మన తప్పు లేదా??..
” అవునంటే అది ఆత్మ వంచనే “..

60 వసంతాల పైబడిన మేరువు మన భారతి. విశ్వసుందరులనీ, బహు సంపన్నులనీ ఒకరిద్దరు దేశీయుల మొహాలు చూబెడితే, వారి జపం చేస్తూ దశాబ్దాలు కాలక్షేపం చేయగల నిరర్థక వారసులను మోస్తున్నది మన భూమి.

పదవుల్లో ఉండి దేశ విదేశాలు చక్కర్లు కొట్టటం, ఎన్నికలకు ముందు ప్రచారం లోనో,ప్రచార సంబంధిత సభలు, రోడ్ షో లు మినహా, పథకాల అమలు, మారుమూల మగ్గుతున్న జాతుల అభివృద్ధి, ప్రభుత్వ రంగ పనితీరు, వంటి వాటిని గమనించే చిత్తశుద్ధి ఎవరైనా చూపారా??

చిత్తశుద్ధా!? “చిత్తమే” అరచేత వైకుంఠం, ఇక దానికి శుద్ధేమిటి??

” మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి ” అనెవరైనా అంటే, కళ్ళు మూసుకుని, కుళ్ళు కంపులో కూడా నేతి వాసన వెతుక్కునే అమాయకులు(??), ‘మాయ’ ని నమ్మే అచేతనులు, ‘చేతలు మావంటే’ తలలూపి, తలరాతలు అవహేళనవుతుంటే, దిగ్భ్రాంతితో ముక్కున వేలేసుకుని చూడటం మినహా, ఈ స్థితిని మార్చే ‘శక్తి’ తమకు ఉందనీ తెలియని వారు, తెలుసుకునే ప్రయత్నం చేయనివారూ, చెబితే విననివారూ ఎవరయా అంటే..

విచక్షణా రాహిత్యానికి నిలువుటద్దంగా మారుతోన్న మన అసభ్య సమాజ నిర్జీవ సభ్యులు.

” నిర్జీవ సభ్యులా!!!!!!!?? ఏం మాట్లాడుతున్నారు మీరు?

రాష్ట్రం కళకళలాడిపోతోంది. ‘ఫీల్ గుడ్’ పవనాలు మిమ్మల్ని పులకరింపజేయటం లేదా?
ఆత్మహత్యలా!? వాళ్ళు ఎక్స్‌గ్రేషియాల కోసం చేస్తున్న త్యాగాలవి. ఇటువంటి(ఆత్మహత్యలా?? ఎక్స్‌గ్రేషియాలా?) వాటిని ప్రోత్సహించటం ఆరోగ్యకరం కాదు. భవిష్యత్ తరాలకు(??) ముప్పు. ఉపాధి అవకాశాలు పుష్కలంగా, వ్యవసాయం పచ్చగా, ప్రజల జీవితాలు బంగరాల్లా మెరిసిపోతున్నాయి. అన్ని రంగాల వృద్ధి సూచీలు వేసవి ఉష్ణోగ్రతలను తలపిస్తూ, రికార్డు స్థాయి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి”.

” అవునవును, వేసవి మంటల్లానే ఉన్నాయి. అన్నదాతలు ఆ మంటల్లొనే మాడి దహించుకుపోతున్నారు “….. ఎకానమీలో అవకతవకల్ని సరిచేయటం అసాధ్యమని, మరిన్ని ఎత్తుపల్లాలను సృజించే సృష్టికర్తలు వీరు. ” మేం రాష్ట్రమంతా తిరిగాం. ఆత్మహత్యల అగత్యమే లేకుండా, ఋణాలు మాఫీ చేస్తాం. రైతులకు ఉచిత విద్యుతిస్తాం, పావలా వడ్డీకే ఋణాలిస్తాం, మాతో చేతులు కలపండి ప్రజలారా.”

మరి చేతులు కలుపుతారా? ఒక్క క్షణం అలోచించండి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఈ నాయకులు, ఎన్నికలకి ఆమడ దూరంలో శరవేగంగా జనంలోకి ఎందుకు దూసుకొస్తున్నారు?
మునుపంతా ఎం చేశారు?

గాంధీనో, అంబేద్కరో మళ్ళీ పుట్టి, వినూత్నంగా ఎన్నికల్లో నిలబడి, అత్యధిక మెజారిటీతో గెలిచి, పదవులనలంకరించినా, మనకి మేలు చేయగలిగేది మన సొమ్ముతోనేగాని, వాళ్ళ ఆస్థులమ్మి, జనాకర్షక పథకాలు అమలు చేయరు.

అయినా పిచ్చి కాకుంటే, గాంధీ అబేద్కర్‌లు పోటీ చేసి గెలిచే సంస్కృతేనా ఇది??

ఎటువంటి పరిస్థితిలో ఐనా బాగానే ఉన్నారంటూ, ఉచితమంటూ, అనుచితంగా, ఉత్తుత్తి మాటలతో, ఎవరిపట్లా సరైన న్యాయం అవలంబించటం చేతకాక, కులాలనీ, వర్గాలనీ రెచ్చగొడుతూ, ప్రజలలో ఒకరి మీద ఆధారపడే ధోరణినీ, మానసిక దౌర్బల్యాన్నీ పెంచి పోషించటం సరైనదా?

ఎట్టి స్థితిలో ఐనా ఉపాధి అవకాశాల్ని మెరుగుపరుచుకుంటూ, భవిష్యత్ తరాలకు సైతం మార్గదర్శకమయే వృత్తులనూ, వ్యాపార అవకాశాలనూ, ప్రజల స్వశక్తినీ, పలనా సామర్థ్యాన్నీ, ప్రోత్సహించి, పెంచే దిశగా ప్రయాణం సరైనదా??

ప్రభుత్వ ఖజానాలో ధనం జనం కోసం ఖర్చవుతుంది. అదంతా ఏ పార్టీ నాయకుడో జోలెపట్టి జనులను యాచించి కూడగట్టిన నిధీ కాదు, చెమట చిందించి సంపాదించినదీ కాదు, రక్తం ధారపోసి కూడబెట్టిందీ కాదు.

మనది. మనం సమకూర్చిందే అదంతా. మన సొమ్ము మనకిస్తూ మనల్ని ఉద్ధరించటానికే అవతరించినట్టు నటించే ఈ మహా నటులకు బ్రహ్మరథం పట్టండి. పట్టం కట్టకండి.

నటనలో తొణికిసలాడే జీవానికి పులకించి పూలదండలేయడి. ఓట్లు వేయకండి.

*** *** *** *** ***

ఎన్నికల ఫలితాలు, 2004

జరగరానివి జరగటం మన చరిత్ర లక్షణం. ఏం చేస్తాం.
ఐతే వాళ్ళు, లేకపోతే వీళ్ళు.

రాజకీయం ముసుగులో, కులపిచ్చి మసిబారిపోయి, కమ్యూనిజం భాష్యం మార్చేసిన కమ్యూనిస్టులు.

ఢిల్లీ నాయకుల చెప్పులు నాకే విగ్రహపుష్టి నేతల నిర్లక్ష్యానికి నలిగిపోయిన ప్రాంతంలో, యువతను రెచ్చగొట్టి, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే, సి.ఎం. కుర్చీ కొత్తదే చేయించుకుని అధిష్టించవచ్చనే అవకాశవాద నాయకులు మరికొందరు.

వారంతా గెలిచారు ఈరోజు.

ఓడిందెవరు? వాళ్ళ వోటమిని కోరుకున్న నేనా?

లేక ఆంధ్రదేశమా??

*** *** *** *** *** ***

Older Posts »