పుస్తకం లో నా వ్యాసం చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారందరికీ ధన్యవాదాలు. వీరందరూ నాకంటే సాహిత్య పఠనం లో కొన్ని వందల రెట్లు అనుభవం, పాండిత్యం ఉన్నవారని నా గట్టి నమ్మకం. ఇది వ్యంగ్యం ఎంతమాత్రం కాదు కానీ, పాఠకలోకం అంతా మీ అంత పరిణతి కలది కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. “మైదానం” చదివి, రంగనాయకమ్మ గరి వ్యాసం పైపైన చూసేసి, ఈ వ్యాసం రాయలేదు నేను.
“సింధు కి రంగనాయకమ్మగారి సాహిత్యం కూడా అర్ధమైనట్టు లేదు” అని పెద్దలెవరో వాత పెట్టారు. మీ అంత సాహిత్యం నేను చదివి, నాకు అర్ధమయిందండీ అని నేను ఆవిడ మాటలను వక్రీకరించి రాస్తే.. అప్పుడు మీరు ఈ మాట అనవచ్చునేమో. సరే మాట ఎలాగూ పడ్డాను కాబట్టి, రంగనాయకమ్మ గారి ఏ వాక్యలలో భావసారూప్యం కనపడి, బలం గా నా మాటలు మీ దాకా చేర్చానో, ఇక్కడ ఉటంకిస్తున్నాను. ఇవి “మైదానం” గురించి రంగనయకమ్మ గారి వ్యాసం లోనివి:
“ప్రేమరహితమైన సాంప్రదాయ సంబంధాలు, పరిమళ రహితమైన గడ్డిపూలవంటివే, కానీ, ప్రేమని తాత్కాలిక వాంచలతో సమానం చేసుకుంటే, వాంచల నీచత్వానికే ప్రేమ ముసుగు కప్పుకుంటే, దాని ఫలితం సాంప్రదాయంలో ఉండే కనీస రక్షణని కూడా సర్వనాశనం చేస్తుంది.”
” రచయిత కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిన ఈ కథలో, రెండు ప్రేమలతో పాటకులందరికీ ఏకీభావం కుదరడం అసాధ్యం. వైరుధ్యాలతో నిండి ఉన్న కథా వస్తువుని ఎన్ని ప్రకృతి వర్ణనలతో అలంకరించినా, ఆ అలంకారమే ఆ కథ స్వభావం మారుస్తుందా? “
“కథలో ఉన్న అసంబద్ధతలని ఏ ప్రకృతి వర్ణనలూ మరుగుపరచలేవు.”
నేను చెప్పిన ఇద్దరు అమ్మాయిల విషయాలూ, స్త్రీలందరూ ఇలానే చేస్తున్నారని నేను చెప్పటం ఎంతమాత్రం కాదు, అది నా వ్యాసం లోనే నిర్ద్వంద్వంగా రాశాను..”ఇప్పటిదాకా నేను చెప్పింది అసంభవం కాదు అని మాత్రమే, సమర్థనీయం అని కాదు. “
ఇంకా “పెళ్ళైన ఆడోళ్ళందరూ లేచిపోతున్నారయ్యా” అని నేను రాస్తే,.”మీ ఊరి అమ్మాయి పిల్లలని వదిలేసి ప్రియుడితో లేచిపోయిందని చెప్పి భర్త చనిపోయిన వాళ్ళందరూ అదే పని చేస్తారంటే మీకు చలం గారే కాదు, వీరేశలింగం గారు కూడా అర్థం కారు.” అని మీరు అంటే చాలా సబబుగా ఉండేది. కాని పక్షంలో అది అసందర్భ విమర్శే అవుతుంది.
మైదానం ఒక సర్రియల్ నవల అన్నారు మరెవరో. ఆమె అమీర్ తో మైదానానికి వచ్చి, సెలయేరులో, వెన్నెలలో, చిరుగలితో సయ్యాటలాడటం వరకూ అది సర్రియల్ నవలే.. అనంతరం పరిణామాలే వికటించాయి. మీరు ఏమి వ్యాసాలలో ఏమి రాసుకున్నా, నా విమర్శ పరిథి మాత్రం, “మైదానం” పాత్రలకే పరిమితం.
సరే.. “రాజేశ్వరి స్థానంలో, నేనో, నావాళ్ళో ఉండిఉంటే.. ఒక స్త్రీగా రాజేశ్వరి లోని శారీరక చైతన్యానికి సరిదూగే పురుషశక్తికి అమీర్ ప్రతీక ఐతే, అతను మరొక స్త్రీని కాంక్షించటం, దానికి ఆమె అంగీకరించి అతడిని స్వహస్తాలతో వేరే ఆమెకి అప్పగించటం”.. సాంప్రదాయమనే కట్ట తెంచుకుని ధైర్యంగా పొంగిన రాజేశ్వరిలాంటి ధీశాలి, ఇలా చేయటం ఊహించగలరా, అది త్యాగమా? దౌర్భల్యమా? ఆత్మవంచనా?
ప్రేయసి గర్భవతి అంటే, కోపంతో కాలితో డొక్కలో తన్నటం, ఎటువంటి విప్లవ చిహ్నమో మరి..
నేనేమీ హిందీ పండితురాలిని కాకపోయినా, “దీదీ” అంటే “సహోదరి” అని అర్ధం అని మాత్రం తెలుసు. సోదరిపై ప్రేమ ఉండటం ఎవరూ కాదు అనరు, కానీ, కామించటం, శారీరకంగా లొంగదీసుకోవటం కూడా విప్లవమే అంటే, “కాదు, అది వికృత ధోరణి” అనడానికి నాకు ఎవరి సాయమూ అవసరం లేదనుకుంటాను.
మరెవరో అంటున్నారు,..”ఇది నాకెప్పుడు అర్ధం కాదు చలాన్ని విమర్శిస్తున్నమనే వాళ్ళందరు ఆయన పలానా పరిస్తితులలలో అలా రాసి వుంటారు కాని ఆ కధ మాత్రం చెత్త… అంటారు? అంటే????? రాజేశ్వరి కి పిల్లలుంటే, మా ఇంటి వెనుకమ్మాయి లా చేసేదా కాదా అనే ఆలోచనతోనో … లేదా మా ఇంటి వెనుకమ్మాయి అలా చేయటం తప్పు కాబట్టి చలం మైదానం తప్పు అని రాసినట్లు వుంది మీ వ్యాసం…”
చలాన్ని విమర్శిస్తున్నాం అనేవాళ్ళతో ఈ మాట అంటే సరిపోతుంది. చలాన్ని విమర్శించటానికి కావలసినది ఏదీ, మైదానం లో పాత్రల జాఢ్యన్ని విమర్శించటానికి అవసరం లేదు. చలాన్ని విమర్శించే జీవితానుభవం కానీ, అవసరం కానీ నాకు లేదు. మా వెనకింటి అమ్మాయో. పక్కింటి అమ్మాయో అలా చేయటం వలన, “మైదానం” రాజేశ్వరిలాగా కుటుంబాన్నీ, సాంప్రదాయమనే మాయనీ దాటి వచ్చే స్త్రీ అనే అంశం సంభవం, అంటే సాధ్యం అని నేను నమ్మాను అని రాశానే తప్ప, ఇందులో comparision or generalisation ఎక్కడా చేయలేదు.
చలం రచనను విమర్శిస్తే, ఆయన్ని విమర్శించటం కాదా, అంటే, ఖచ్చితంగా “కాదు” అనే చెప్తాను. దానికి కారణం కూడా, నా వ్యాసం లోనే చెప్పాను. 1927 న చలం ఈ కథను రాసేనాటికి సమాజం, స్త్రీల జీవనం ఎలా ఉండెదో, దాదాపు అందరికీ తెలిసే ఉంతుంది. ఒకవేళ తెలియని వాళ్ళుంటే, మీ నానమ్మ, వీలైతే వాళ్ళ తల్లిదండ్రులనో అడిగి చూడండి, నాకు తెలిసినదీ పెద్దవాళ్ళు చెప్పబట్టే. రాజేశ్వరి లాంటి స్త్రీల జీవనం, పొద్దున్నే లేచి, మొగుడికాళ్ళు కళ్ళకద్దుకుని, శారీరకంగా, మానసికంగా ఎంత అసంతృప్తి ఉన్నా భరించటమే స్త్రీ ధర్మమనే భ్రమలో, దాన్ని దాటితే మహాపాపమనే ధోరణిలో గడిచింది. పుట్టి కళ్ళు తెరిచింది మొదలు స్త్రీ ఎలా ఉండాలి అని తల్లి మొదలు చుట్టూ తన పరిధిలోని ప్రపంచమంతా ఇలాంటి నీతులనే మెదడుకెక్కించే పరిస్తితులవి. చలంగారిలాగా, మీలాగా నూత్నధోరణి ఏదైనా చెప్తే వాళ్ళని వెలివేసిన కాలం కాదా అది..
అటువంటి సమాజానికీ, అందులో మగ్గుతున్న ఆడవాళ్ళకీ కూడా “HIGH VOLTAGE ELECTRIC SHOCK” లాంటిది “మైదానం”.
స్త్రీ బానిసత్వానికి కారణమని భావించేవారందరినీ నడివీధిలో చెంపలు వాయగొట్టాలన్నంత కోపం చలం నరనరాల్లో ఉందండానికి “అమీర్” పాత్రే నిదర్శనం. రాజేశ్వరి భర్తనీ, మేనమామనీ, బావనీ, ముత్తైదువుల్నీ అతడు దూషించటమె అందుకు తార్కాణం.
“అతను వాళ్ళని తిట్టినా నాకేమీ అనిపించట్లేదు, అదేదో గతజన్మలా ఉంది” అని రాజేశ్వరి అనటం నా అంచనాకు ఊతం.
